శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం(M) డొంకూరు గ్రామానికి చెందిన బడే చంటి (22) అబుదాబి లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అబుదాబిలో వెల్డింగ్ పనులు చేస్తూ... చంటి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంపెనీ యాజమాని మృతుని కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తూ... తమ కుమారుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వ విప్ అశోక్ బాబు కు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు కోరారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.