రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ప్రత్యర్థిపై టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్ల వద్ద 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ (72), యాన్సన్(70), బాష్(67) కంగారు పెట్టినా.. గెలుపు భారత్ వశమైంది.
హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్లో రికెల్టన్(0), డికాక్(0) వెనువెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత మార్క్రమ్(7) ఐదో ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లో కీపర్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అప్పటికే క్రీజులో ఉన్న మాథ్యూ.. డిజార్జి(39)తో కలిసి నాలుగో వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 15వ ఓవర్లో డిజార్జి.. కుల్దీప్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రెవిస్ (37) 22వ ఓవర్లో హర్షిత్ వేసిన బంతిని సిక్స్ మలిచే క్రమంలో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన యాన్సన్ దూకుడుగా ఆడుతూ.. మాథ్యూకి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. అయితే, 34వ ఓవర్లో కుల్దీప్ వీరిద్దరిని పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత వచ్చిన సుబ్రయెన్ 17 పరుగులకు ఔటయ్యాడు. చివర్లో బాష్ (67) పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, హర్షిత్రణా 3, అర్ష్దీప్ 2, ప్రసిద్ధ ఒక వికెట్ తీశారు. అంతకుముందు విరాట్ కోహ్లి(135) శతకంతో.. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ 349/8 స్కోర్ చేసింది.