ఏపీ లోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జనవరి 19న (సోమవారం) తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. కాలేజీల సెలవుల గురించి ప్రకటన రావాల్సి ఉంది. అటు తెలంగాణలోనూ స్కూళ్లకు ఇవే తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.