ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలాస ఉల్లాసపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ... నేడు ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకున్న పర్వదినమని తెలిపారు. ఇటీవల పలాసలో జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేసుకొని, పోలీసులు ముందస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.