శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. అనంతరం లారీ పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిస్సా ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందగా... నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బారువ ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.