శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. అనంతరం లారీ పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిస్సా ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందగా... నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బారువ ఆసుపత్రికి తరలించారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.