శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రోటరీ నగర్ లో ఇటీవల జరిగిన చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రోటరీ నగర్ కు చెందిన సునీత పాత్రో ఇంట్లో ఇటీవల 5 తులాల బంగారం చోరికి గురైంది. చోరీ జరిగిన కేవలం ఒక్క రోజులో నిందితులను పట్టుకున్న సీఐ రామకృష్ణ తోపాటు సిబ్బందిని సోమవారం డిఎస్పి షేక్ సహబాజ్ అహమ్మద్ అభినందించారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.