శ్రీకాకుళం జిల్లా పలాసలో రేపు జరగనున్న జామి జాతరకు ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు బుధవారం అడిషనల్ ఎస్పీ కె వి రమణ విలేకరులతో తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఇటు ట్రాఫిక్, అటు ఎల్లమ్మ తల్లి గుడి వద్ద సుమారు 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సిఐ రామకృష్ణ మాట్లాడుతూ... జాతర సందర్భంగా జంట పట్టణాలలో ట్రాఫిక్ మళ్లించామన్నారు. జాతరలో యువకులు గలాటా చేస్తే.. వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.