Skip to main content

ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించిన సిక్కోలు యువకుడు.

ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించిన పొల్లాడ యువకుడు బంగారు సందీప్

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ గ్రామానికి చెందిన బంగారు సందీప్ (వయస్సు 23) ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలను సాధించి అరుదైన ఘనత సాధించారు. ఆయన రీజినల్ రూరల్ బ్యాంక్‌లో ప్రొబేషన్‌రీ ఆఫీసర్ (PO), ఐబీపీఎస్ క్లర్క్ మరియు రీజినల్ రూరల్ బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఎంపికై తన ప్రతిభను చాటుకున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు ఇలాంటి విజయాన్ని సాధించడం స్థానికంగా ఆనందం మరియు గర్వకారణంగా మారింది.


చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సందీప్ తన పాఠశాల విద్యను పూండి సాయి వినీత పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్, మునసబుపేటలో ఇంటర్మీడియట్ చదివారు. తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ విద్యను పూర్తిచేసి, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో క్రమశిక్షణతో సన్నద్ధమయ్యారు.


తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు అనేక గంటలు కృషి చేసి బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమని సందీప్ నిరూపించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారం మరియు గురువుల మార్గదర్శకత్వం తన విజయానికి ప్రధాన కారణమని సందీప్ తెలిపారు.


సందీప్ కుటుంబంలో విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆయన సోదరి బంగారు లావణ్య కూడా యూకో బ్యాంక్ దేవరపల్లి బ్రాంచ్‌లో AFOగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి గౌరవం తీసుకువస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు ఉండటం గ్రామానికి గర్వకారణంగా మారింది.

సందీప్ ఈ విజయంతో తమ గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచారు. పట్టుదలతో చదువుకుంటే గ్రామీణ ప్రాంతాల నుంచే పెద్ద విజయాలు సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఈ సందర్భంగా సందీప్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు పొల్లాడ గ్రామస్తులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

High Viewed News

పూండిలో కలకలం రేపిన బంగారం చోరీ...

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.

పలాసలో రైలు నుంచి జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు

కలకత్తా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో ప్రయాణం చేస్తూ... ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ జారిపడింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సత్యం & వెంకట్రావు ఘటన స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించి, వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ అస్సాం కు చెందిన అజ్వినా ఖాన్ గా గుర్తించి కేసు నమోదు చేసిన పలాస జిఆర్పి పోలీసులు.

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

SIR విధులకు అదనపు వేతనం ఇవ్వాలని వినతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు అదనపు గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావుకు ఆదివారం కంప్యూటర్ ఆపరేటర్లు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. SIR విధుల్లో భాగంగా అదనపు పనిభారం, సాంకేతిక మరియు ఇతర కార్యనిర్వహణ సమస్యలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. అదనంగా నిర్వహిస్తున్న విధులను పరిగణనలోకి తీసుకుని అదనపు గౌరవ వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు సానుకూలంగా స్పందిస్తూ... తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సిమ్మన్న, హరి, కోదండ, సుధాకర్ తదితర ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.