శ్రీకాకుళం జిల్లా పలాస తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమం గురించి వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ లు, మహిళలకు స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తున్నామన్నారు. పల్లె పండగ ద్వారా ప్రతీ గ్రామంలో రోడ్లు వేశామని వెల్లడించారు.
పలాస నియోజకవర్గంలో దాదాపు రూ. 930 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కాశీబుగ్గ రైల్వే వంతెన త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆఫ్ షోర్ జలాశయం కూడా త్వరలోనే పూర్తి చేసి నియోజక వర్గ ప్రజలకు సాగు, త్రాగు నీటిని అందిస్తామన్నారు. అమృత భారత్ కింద దాదాపు రూ. 60 కోట్లతో పలాస రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మరో వైపు జాబ్ మేళాలతో వందల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. పలాసలో ఒక జీడి బోర్డు కోసం స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రస్తుతం పలాసలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రశాంతంగా ఉందన్నారు.