- ప్రమాద పరిస్థితిని తారుమారు చేసిన మాజీ మంత్రి అప్పలరాజు పై చర్యలకు ఆదేశం
- నీతి మాటలు వల్లించడంలో మంత్రి అప్పలరాజు ఘనుడు
- డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ది
- పార్టీ తరఫున పది లక్షల రూపాయల నష్ట పరిహారం
- దానయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గౌతు శిరీష వెల్లడి
శ్రీకాకుళం, జులై 13,
ఇటీవల మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబ పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి, శ్రీకాకుళం ఇన్చార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తో కలిసి దానయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... మృతుని (దానయ్య) కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పది లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు చేసిన ప్రమాదాన్ని తారుమారు చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దారుణమన్నారు. మాజీ మంత్రి అప్పలరాజుపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను రాజకీయంగా మాట్లాడే అప్పలరాజు సొంత కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చటానికి ప్రయత్నం చేయటం ఆక్షేపించదగిన విషయం కాదన్నారు. నీతి మాటలు వల్లించే అప్పలరాజు రోడ్డు ప్రమాద సంఘటనను తప్పుదోవ పట్టించటం బాధాకరమైన విషయం అన్నారు. వైసిపి నాయకుల పరిస్థితిని గమనించినట్లయితే గతంలో డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడిన చరిత్ర వైసీపీకి ఉందన్నారు. ఇద్దరు చిన్నపిల్లలతో, భార్య, వయోభారంతో ఉన్న తల్లి గొర్రెల కాపరి దానయ్య ఆకస్మిక మృతితో వారి కుటుంబం అనాధలా మారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించమని పంపించడం జరిగిందన్నారు. ప్రమాదం చేసిన మంత్రి కుమారుడుని మార్చి వేరొక వ్యక్తిని కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన మంత్రి తప్పిదాన్ని పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. ఈ రోడ్డు ప్రమాద సంఘటనపై ఇప్పటికే పోలీసు వ్యవస్థ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంత్రి గారితో పాటు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
.....................................
జారీ: రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రివర్యులు కార్యాలయం